'కాళ్లు/ చేతులు నరికితేనే చట్టాలను పాటిస్తారేమో'.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
నేటి సమాజంలో ప్రజలు చాలా తేలికగా నేరాలు చేస్తున్నారని, బహుశా చట్టాలను ఉల్లంఘించే వారి "కాళ్లు లేదా చేతులు నరికివేస్తేనే" ప్రజలలో చట్టం పట్ల భయం, గౌరవం వస్తుందేమోనని కర్ణాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మే 29న ఒక అత్యాచారం కేసులో నిందితుడైన ఇంజనీరింగ్ విద్యార్థి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ ఆర్. నటరాజ్ ఈ మౌఖిక వ్యాఖ్యలు చేశారు. "మన దేశంలో ప్రజాస్వామ్యం ఉండటం వల్లే ప్రతి ఒక్కరూ చట్టాలను చాలా తేలికగా (గ్రాంటెడ్గా) తీసుకుంటున్నారు. నేరస్థులను మనం గట్టిగా శిక్షించకపోవడం వల్లే చట్టాలకు పళ్ళు లేకుండా పోయాయి. అందుకే మిడిల్ ఈస్ట్ (అరబ్ దేశాల) తరహాలో కాకుండా, ఇక్కడ నేరం చేయడం చాలా సులభంగా మారింది" అని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
ఈ కేసు వివరాల్లోకి వెళితే.. బాధిత యువతి, నిందితుడు ఒకే కాలేజీలో క్లాస్మేట్స్. జూలై 2023లో నిందితుడు తన ప్రేమను వ్యక్తపరచగా ఆమె అంగీకరించింది. అయితే, సెప్టెంబర్ 12, 2023న ఇద్దరి మధ్య గొడవ జరగడంతో, రాజీ పడదామని నమ్మించి ఆమెను తన అపార్ట్మెంట్కు పిలిపించుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో తీవ్ర మానసిక క్షోభకు గురైన సదరు యువతి డిప్రెషన్లోకి వెళ్లి మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందింది. ఆ తర్వాత ఆమె బెంగళూరుకు మారి, జాతీయ మహిళా కమిషన్ (NCW)ను ఆశ్రయించింది. ఈ కేసు పోలీసుల వద్దకు వెళ్లిన తర్వాత, మొదట మార్చి 20, 2026న నిందితుడు విచారణకు హాజరై స్టేట్మెంట్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ, ఏప్రిల్ 4న బాధితురాలు మరోసారి రేప్ కేసు నమోదు చేయడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.