పంట అవశేషాలు కాలిస్తే కేసులు : హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్
హనుమకొండ, వెలుగు: పంట అవశేషాలు, వ్యవసాయ వ్యర్థాలను కాల్చి ప్రమాదాలకు కారణమైతే బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 223 కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హెచ్చరించారు. పంట వ్యర్థాల కాల్చివేత వల్ల వాయు కాలుష్యం పెరగడం, పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం, ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడుతున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా వాటి దహనాన్ని నిషేధిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పంట అవశేషాలను కాల్చడం వల్ల భూసారం కూడా దెబ్బతింటుందని పేర్కొన్నారు.
ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయడంతో పాటు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, కోతల సమయంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.