Arjun Sarja | అబద్ధపు ప్రచారాలు చేయలేను.. ‘ఫేక్ కలెక్షన్స్’ పోస్టర్లపై యాక్షన్ కింగ్ అర్జున్ సంచలన వ్యాఖ్యలు
Arjun Sarja | తన స్వీయ దర్శకత్వంలో, స్వంత నిర్మాణ సంస్థ శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా నిర్మించిన తాజా చిత్రం ‘సీతా పయనం’. ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఇటీవల థియేటర్లలో విడుదలై మోస్తారు కలెక్షన్లను రాబట్టింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతుంది.
అయితే ఈ సినిమా కలెక్షన్లకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని అర్జున్ సర్జా తాజాగా పంచుకున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ బాధ్యతను చూసుకునే ఒక మార్కెటింగ్ ఏజెన్సీ, కేవలం 4 రోజుల్లోనే ఈ చిత్రం రూ. 4 కోట్లు వసూలు చేసినట్లు ఒక పోస్టర్ను విడుదల చేద్దామని అర్జున్కు ప్రతిపాదించింది. దీనిపై స్పందించిన అర్జున్ ఆ మార్కెటింగ్ ఏజెన్సీ ప్రతిపాదనను తీవ్రంగా తిరస్కరిస్తూ, తనకు అంత డబ్బు అసలు రాలేదని, అలాంటప్పుడు అబద్ధపు వసూళ్లతో కూడిన ఫేక్ పోస్టర్లను ఎలా వేస్తామని వారిపై మండిపడినట్లు మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం సినిమాల్లో కలెక్షన్ల కోసమని ఫేక్ నంబర్లతో పోస్టర్లు వేయడం సర్వసాధారణంగా మారిన తరుణంలో, అర్జున్ నిజాయితీగా ఉంటూ అటువంటి తప్పుడు ప్రచారాలను తిరస్కరించడం విశేషమని నెటిజన్లు అతడిని ప్రశంసిస్తున్నారు.